తను వెస్టిబులర్ హైపోఫంక్షన్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రకటించారు. ఈ వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు ఆయన ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించారు. చెవి లోపలి భాగాల్లో సమస్య ఏర్పడటం వల్ల ఈ రుగ్మత వస్తుంటుంది. మగతగా ఉంటడం, శరీరం సమతూకం కోల్పోవడం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు కాగా…చూపు మందగించడం, వినికిడి లోపం కూడా ఏర్పడుతుంటుంది.
తన కొత్త సినిమా ‘భేడియా’ ప్రమోషన్స్లో భాగంగా వరుణ్ ధావన్ తాను పూర్తి ఆరోగ్యంగా లేనని, వెస్టిబులర్ హైపోఫంక్షన్తో బాధపడుతున్నట్లు తెలిపారు. సన్నిహితులు ఆందోళన చెందడంతో తాజాగా వివరణ ఇచ్చారు వరుణ్. ఆయన స్పందిస్తూ…‘నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. పూర్తిగా కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నాను. అలవాట్లను మార్చుకుంటున్నా, యోగా చేయడంతో పాటు చికిత్స తీసుకుంటున్నా’ అని అన్నారు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన వరుణ్ ధావన్ పలు హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయన కొత్త సినిమా ‘భేడియా’ ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్నది.