ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా జాన్వీకపూర్ తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఘట్టాల కోసం హలీవుడ్ స్టంట్ నిపుణుడు కెన్నీ బేట్స్ పనిచేస్తున్నారు. పవర్ఫుల్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో కథానుగుణంగా ప్రతినాయకుడి పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుందట. అందుకోసం చిత్రబృందం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ను సంప్రదించగా ఆయన సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తే ఉత్తరాది బెల్ట్లో కూడా సినిమాకు మంచి రీచ్ ఉంటుందని చిత్రబృందం ఆలోచనగా చెబుతున్నారు. సైఫ్ అలీఖాన్ తిరస్కరించడంతో ప్రతినాయకుడి పాత్ర కోసం మరో ప్రముఖ నటుడి అన్వేషణలో చిత్రబృందం ఉందని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.