హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ విపక్షాలతో సమావేశాలు నిర్వహించడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తేల్చుకోవాలని టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. టీఆర్ఎస్ ఎన్నారై సభ్యులెవరూ ఈటలతో మాట్లాడటం లేదని, తామంతా సీఎం కేసీఆర్వెంటే ఉన్నామని చెప్పారు. గతంలో ప్రొఫెసర్ కోదండరామ్ను నట్టేట ముంచిన ఎన్నారైలే ఇప్పుడు ఈటలతో మాట్లాడుతున్నారని, వారితో ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఈటలకు యూఎస్ఏ నుంచి మద్దతు తెలుపుతున్నవారంతా ప్రతిపక్ష పార్టీల వారేనని మహేశ్ బిగాల తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరైనా ముప్పు తలపెట్టాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.