Bipasha Basu | బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి బిపాసా బసు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఓ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత బిపాసా బసు నటిస్తున్న కొత్త సినిమాపై బాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న పీరియడికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘బారాబంకి’ లో బిపాసా బసు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. క్రైమ్, డ్రామా అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం ‘బారాబంకి’ కథ 1984లో చోటుచేసుకున్న ఓ యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఆ కాలం నాటి పరిస్థితులు, నేర నేపథ్యం, మానవ సంబంధాలను మేళవిస్తూ హన్సల్ మెహతా ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. పీరియడిక్ బ్యాక్డ్రాప్లో క్రైమ్, డ్రామాను మిళితం చేస్తూ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో.. హన్సల్ మెహతా మార్క్లో ఉండే రియలిస్టిక్ మేకింగ్ కనిపించనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ‘బారాబంకి’లో బిపాసా బసుతో పాటు యువ నటులు సన్నీ కౌశల్, విశాల్ జేత్వా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ బిపాసా అనుభవంతో పాటు యువ నటుల ఎనర్జీ, హన్సల్ మెహతా విభిన్నమైన టేకింగ్ కలిసి ఈ ప్రాజెక్ట్పై అంచనాలను పెంచుతున్నాయి.
అయితే బిపాసా పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం చిత్రబృందం ప్రస్తుతానికి వెల్లడించలేదు. కథలో ఆమె పాత్ర కీలక మలుపులకు కారణమవుతుందా? లేక కథను నడిపించే ప్రధాన పాత్రలో కనిపిస్తారా? అనేది సినిమా విడుదలకు దగ్గరయ్యే కొద్దీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బిపాసా బసు చివరిసారిగా ‘అలోన్’ సినిమాలో హీరోయిన్గా కనిపించారు. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని వివాహం చేసుకున్న బిపాసా.. ఆ తర్వాత కుటుంబ జీవితంలో బిజీ అయ్యారు. 2022లో ఈ దంపతులకు కుమార్తె జన్మించింది. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు బిపాసా సినిమాలకు మరింత దూరంగా ఉన్నారు.ఈ కారణంగా ఆమెను వెండితెరపై మళ్లీ చూడాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ‘బారాబంకి’తో బిపాసా రీ-ఎంట్రీ ఇస్తున్నారనే వార్త వారిలో మరింత ఆసక్తిని పెంచుతోంది.