Bigg Boss | వెండితెరపై మెరిసినా, బుల్లితెరపై సందడి చేసినా తనదైన ముద్ర వేసుకున్న నటి అశ్విని శ్రీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఎప్పుడూ నవ్వుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ… తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పెంపుడు కుక్కను కోల్పోవడంతో తీవ్ర మనోవేదనలో మునిగిపోయారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్న పోస్ట్ ఇప్పుడు అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. అశ్విని శ్రీ ఎంతో ప్రేమగా పెంచుకున్న తన పెంపుడు కుక్క ‘సోనూ’ ఇటీవల మరణించింది. ఈ విషాదాన్ని తట్టుకోలేకపోయిన ఆమె, సోనూతో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు.
“నా సోనూ బాయ్ని కోల్పోయాను… ఈ బాధను మాటల్లో చెప్పలేను” అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇదే సమయంలో పెట్ లవర్స్కు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. సోనూ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నాడని, కానీ బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని అశ్విని తెలిపారు. మీ దగ్గర పెంపుడు జంతువులు ఉంటే తప్పకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించండి. అవి తమ బాధను చెప్పుకోలేవు. బయటకు ఆరోగ్యంగా కనిపించినా లోపల తీవ్రమైన సమస్యలు ఉండొచ్చు అంటూ ఆమె సూచించారు. నా సోనూని కాపాడుకోవడానికి ఇంకో అవకాశం దొరికితే ఏమైనా చేసేదాన్ని అంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
అశ్విని శ్రీ తన కెరీర్ను మోడల్గా ప్రారంభించి, తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 2016లో విడుదలైన వినోదం 100% చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత అమీర్పేటలో, బి.టెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. అదే సమయంలో రవితేజ నటించిన రాజా ది గ్రేట్లో స్పెషల్ సాంగ్తో పాటు, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అశ్విని శ్రీ కెరీర్కు అసలు మలుపు తీసుకొచ్చింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 . వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి వెళ్లిన ఆమె, తన అందం, నిజాయితీ గల ఆటతీరుతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఈ షో తర్వాత ఆమెకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెరిగి, వరుస సినిమా అవకాశాలు, సోషల్ మీడియా బ్రాండ్ కొలాబరేషన్లు వచ్చాయి. అశ్విని శ్రీ షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ చూసిన అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఈ కష్ట సమయంలో ఆమె త్వరగా కోలుకోవాలని, దేవుడు ఆమెకు బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు.