శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘భాగ్సాలే’. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకుడు. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. జూలై 7న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకులు హరీష్ శంకర్, దశరథ్, వశిష్ట ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా హరీశ్శంకర్ మాట్లాడుతూ ‘మత్తు వదలరా సినిమా చూశాక సింహాకు ఫ్యాన్ అయ్యాను. ‘భాగ్ సాలే ’ కథ నాకు తెలుసు. సినిమా అంతా సరదాగా సాగుతూ వుంటుంది. నేను ఈ సినిమా నిర్మించాలని అనుకున్నాను కానీ మిస్ అయింది. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది’ అన్నారు. నిర్మాత యశ్ రంగినేని మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ కామెడీ జానర్ సినిమా. కథ ఆసాంతం ఎంటర్టైనింగ్గా ఆసక్తిగా సాగుతుంది. సినిమాలో సింహా ఎంతో ఎనర్జిటిక్గా కనిపిస్తాడు. తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అన్నారు.