‘భారతదేశం కళలకు కాణాచి. ఎన్నో కళలకు సంబంధించి గొప్ప కళాకారులందరూ మన దేశానికి వన్నెతెచ్చారు. నాట్యకళ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ సంధ్యరాజు రూపొందించిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు అగ్రహీరో బాలకృష్ణ. కూచిపూడి డ్యాన్సర్ సంధ్యరాజు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకుడు. కమల్ కామరాజు కీలక పాత్రధారి. ఈ సినిమాలోని ‘నమఃశివాయ’ గీతాన్ని శుక్రవారం బాలకృష్ణ విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నాట్యకారిణికి, ఆమె గురువుకు మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. కథానాయిక, నిర్మాతగానే కాకుండా కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్ డిజైనర్గా తన బాధ్యతల్ని పరిపూర్ణంగా సంధ్యరాజు నిర్వర్తించారు. ‘నమఃశివాయ’ పాటను ఆరు రోజుల పాటు లేపాక్షీ ఆలయంలో తెరకెక్కించాం. క్లాసిక్, ఫోక్ శైలులతో శ్రవణ్ భరద్వాజ్ చక్కటి బాణీలను అందించారు. కాలభైరవ, లలిత కావ్య ఈ పాటను ఆలపించారు’ అని తెలిపారు. రోహిత్, ఆదిత్యమీనన్, భానుప్రియ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: రేవంత్ కోరుకొండ.