సంక్రాంతి బరిలో దిగబోతున్నారు నాగార్జున. నాగచైతన్యతో కలిసి ఆయన హీరోగా నటిస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానున్నది. కల్యాణ్కృష్ణ దర్శకుడు. నాగార్జున నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్లో నాగార్జున మాట్లాడుతూ ‘సినిమాను ప్రారంభించినప్పుడే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకుతీసుకురావాలనుకున్నాం. ఒమిక్రాన్ ప్రభావం తగ్గుముఖం పట్టి అన్ని సవ్యంగా ఉంటే అనుకున్నట్లుగానే ఈ నెల 14న విడుదలచేస్తాం. అఖిల్ ఇందులో నటించలేదు. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వాయిదాపడటం బాధను కలిగిస్తుంది. చాలా ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడి సినిమాలను తెరకెక్కించారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే ప్రపంచం మొత్తం ఆ సినిమాలు విడుదలకావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యంకాదు. సినిమా వేడుకల్లో రాజకీయ అంశాల గురించి మాట్లాడను. ఏపీలోని టికెట్ల రేట్ల సమస్య వల్ల మా సినిమాకు ఎలాంటి ఇబ్బందులుండవనుకుంటున్నా. టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటే వసూళ్లు పెరిగేవి. కరోనా వల్ల ఇతర రాష్ర్టాల్లో థియేటర్లపై ఆంక్షలు విధించారు. వాటి కారణంగా మా సినిమా వసూళ్లు తక్కువగానే ఉంటాయనుకుంటున్నా. సినిమా పూర్తిచేసి వేచిచూడటం కంటే విడుదలచేయడమే ఉత్తమమని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.