యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 14 : యాదగిరిగుట్ట ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ భూతల స్వర్గంగా తీర్చిదిద్దారని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ అన్నారు. మంగళవారం సతీసమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ట్విట్టర్ వేదికగా పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణ అద్భుతమైన ప్రగతిపథం వైపు దూసుకుపోతుందని చెప్పడానికి యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం ఓ నిదర్శనమన్నారు. రాష్ర్టాన్నే కాదు.. దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతిపథం వైపు నడిపించే సత్తా, సామర్థ్యం ఆయనకు ఉన్నాయని నమ్మక తప్పదని పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట ఆలయం చూశాక చాలా సంతోషం అనిపించిందని, కేసీఆర్కు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయకుండా ఉండలేక పోతున్నానని చెప్పారు. ఏ స్వార్థ్ధం కోసమో, ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఆశించి ఈ విషయం చెప్పడం లేదని, నా మనసులోని మాటలు చెబుతున్నానని వివరించారు. మంచి చేస్తే మంచి అని చెప్తాను.. లేకపోతే మౌనంగా ఉంటానని, అదే తన నైజమని పేర్కొన్నారు. ‘మీరు అద్భుతం, యుఆర్ ఏ వండర్ఫుల్.. యు ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యూ కేసీఆర్’ అంటూ పొగిడారు.
‘భారతదేశంలో అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మీ ఆలోచన విధానం, మీ కఠోర తపస్సు, మీ ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడింది. మీ మదిలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఆలోచనను ఆచరణలో పెట్టి ప్రజలకు అందించాలన్న మీ సంకల్పం చాలా గొప్పదని. ఆనందంగా, చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ రాష్ర్టానికే కాకుండా దేశానికి మీ అమూల్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు. సీఎం కేసీఆర్ గారి ఆలోచన, ఆచరణ, నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ఆలోచన విధానం మహాద్భుతంగా ఉన్నాయని తృప్తి చెందానని చెప్పారు. లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు ముఖ్యమంత్రిపై, ప్రజలందరిపైనా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.