రివ్యూ: వీరసింహా రెడ్డి
తారాగణం: బాలకృష్ణ, శృతిహాసన్, హనీరోజ్, వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్, నవీన్చంద్ర, మురళీశర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
సంగీతం: తమన్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, రవిశంకర్
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
ఫ్యాక్షన్ కథల్లో అద్భుతంగా ఒదిగిపోయి రక్తి కట్టిస్తారు బాలకృష్ణ. రాయలసీమ నేపథ్య కథాంశాలతో ఆయన చేసిన సినిమాలు మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ‘వీరసింహా రెడ్డి’ చిత్రం ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని పెంచింది. ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ తదుపరి చిత్రమిదే కావడం..ఆయనకు వీరాభిమాని అయిన దర్శకుడు గోపీచంద్ తెరకెక్కించడంతో ‘వీరసింహా రెడ్డి’ ఈ సంక్రాంతి బరిలో అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించింది? బాలకృష్ణ మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారా లేదో తెలుసుకుందాం..
కథ ఏంటంటే:
కర్నూల్ జిల్లాలోని పులిచర్ల ప్రాంతానికి చెందిన వీరసింహారెడ్డిని ప్రజలు దైవంలా కొలుస్తుంటారు. అనుక్షణం ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకోవడానికి ముందుంటాడు వీరసింహారెడ్డి. సీమలో ఫ్యాక్షన్ అంతమవ్వాలనే తాను కత్తిపట్టానని, భవిష్యత్తు తరాలు మాత్రం శాంతితో జీవించాలన్నది వీరసింహా రెడ్డి ఆశయం. ఇదిలా ఉండగా వీరసింహా రెడ్డిని చంపాలని ఆయన చెల్లెలు భానుమతి (వరలక్ష్మీ శరత్కుమార్) తన భర్త ముసలిమడుగు ప్రతాప్రెడ్డితో (దునియా విజయ్) కలిసి ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో గతంలో తనను ప్రేమించి దూరంగా వెళ్లిపోయిన మీనాక్షి (హనీ రోజ్), కొడుకు జై (బాలకృష్ణ)ను కలవడానికి వీరసింహా రెడ్డి ఇస్తాంబుల్ వెళతాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి ప్రతాప్రెడ్డి తన బలగంతో ఇస్తాంబుల్ వెళ్లి వీరసింహా రెడ్డిని చంపేస్తాడు. సొంత చెల్లెలు భానుమతి తన అన్న వీరసింహా రెడ్డిని చంపేంత పగ పెంచుకోవడానికి కారణమేమిటి? ముప్పైఏళ్ల పాటు వీరసింహా రెడ్డికి దూరంగా మీనాక్షి ఇస్తాంబుల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? చివరగా తండ్రి వీరసింహా రెడ్డి ఆశయాన్ని కొడుకు జై ఎలా నెరవేర్చాడు? అన్నదే చిత్ర కథ..
ఎలా ఉందంటే:
రెగ్యులర్ ఫ్యాక్షన్ కథాంశాల మాదిరిగా పగ, ప్రతీకారం ప్రధానంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీరసింహా రెడ్డి’. ఈ నేపథ్యానికి చెల్లెలి సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ హంగులు దట్టించి బాలకృష్ణ అభిమానుల్ని అలరించేలా తీర్చిదిద్దాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. రొటీన్ ఫార్ములా చిత్రమైనా చెల్లెలు సొంత అన్నపై పగను పెంచుకోవడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు కారణాల్ని దర్శకుడు కన్విన్సింగ్గా తెరపై ఆవిష్కరించాడు. ప్రథమార్థమంతా భారీ యాక్షన్ హంగులతో సాగింది. వీరసింహా రెడ్డి హీరోయిజాన్ని ఆవిష్కరించే ఎలివేషన్స్, రొమాంచితమైన పోరాట ఘట్టాలతో అభిమానులకు ఊపునిచ్చేలా ప్రథమార్థాన్ని తీర్చిదిద్దారు. అయితే సినిమా ఆరంభంలో ఇస్తాంబుల్లో శృతిహాసన్ పరిచయ ఘట్టాలు, జైతో ఆమె లవ్ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకోదు.
వీరసింహా రెడ్డి మరణంతో కథ ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. తన అన్నయ్యపై భానుమతి పగను పెంచుకోవడానికి కారణాల్ని వివరిస్తూ ద్వితీయార్థాన్ని ఆరంభించారు. సెకండాఫ్లో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్స్కు పెద్దపీట వేశారు. వీరసింహా రెడ్డి, ఆయన చెల్లెలు భానుమతి మధ్య వచ్చే సన్నివేశాల్లో కావాల్సినంతం సెంటిమెంట్ను పండించారు. అన్నా చెల్లెలు ప్రేమ, వారి మధ్య అనుకోని సంఘర్షణ నేపథ్యంలో కథను అనేక లేయర్స్గా అల్లుకున్న విధానం మెప్పిస్తుంది. ఇక క్లెమాక్స్ ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే సాగింది. ద్వితీయార్థంలో చక్కటి ఎమోషన్స్ పండినప్పటికీ కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. ఫైట్ సీక్వెన్స్లో రామ్లక్ష్మణ్ కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్హాఫ్లో వీరసింహా రెడ్డి కూర్చిలో కూర్చొని ప్రత్యర్థుల్ని చిత్తు చేసే యాక్షన్ ఎపిపోడ్ను బాగా డిజైన్ చేశారు. సినిమా నిడివిని కాస్త తగ్గిస్తే బాగుండేదనే భావన కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే:
ఈ సినిమాలో వీరసింహా రెడ్డి పాత్రలో బాలకృష్ణ అద్భుతమైన నటనను కనబరిచాడు. తనదైన డైలాగ్ డెలివరీ, హావభావాలతో విశ్వరూపం చూపించారు. ఇక జై పాత్రకు స్క్రీన్ స్పేస్ తక్కువగానే ఉన్నా ఆ క్యారెక్టర్లో కూడా బాలకృష్ణ మెప్పించారు. మొత్తంగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం బాగుంది. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వరలక్ష్మి శరత్కుమార్ అభినయం గురించి. నెగెటివ్ షేడ్స్తో కూడుకున్న పాత్ర అయినా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. శృతిహాసన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. ఏవో కొన్ని సన్నివేశాలకు, రెండు పాటలకు పరిమితమైపోయింది. ప్రతాప్రెడ్డి పాత్రలో దునియా విజయ్ చక్కటి విలనీ పండించాడు. హానీరోజ్ పాత్ర ఫర్వాలేదనిపిస్తుంది. నవీన్చంద్ర, అన్నపూర్ణమ్మ, అజయ్ఘోష్ తమ పరిధుల మేరకు నటించారు. సినిమా ఆరంభంలో బ్రహ్మానందం, అలీ కామెడీ ఎపిసోడ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అంతగా నవ్వించలేకపోయారు.
ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా సంభాషణలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. బాలకృష్ణ ఇమేజ్ను ఎలివేట్ చేస్తూ అభిమానులతో చప్పట్లు కొట్టించేలా ప్రతి డైలాగ్ రాశారు. బాలకృష్ణపై తనకున్న అభిమానాన్ని సంభాషణల్లో చాటుకున్నారు సాయిమాధవ్ బుర్రా. ఈ క్రమంలో బాలకృష్ణ పాత్ర ద్వారా ఏపీ రాజకీయ పరిస్థితులపై విమర్శనాత్మకంగా కొన్ని సంభాషణలు పేలాయి. తమన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచింది. యాక్షన్ ఎపిసోడ్లో బీజీఎమ్ బాగా డిజైన్ చేశారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ..బాలకృష్ణపై తన అభిమానాన్ని చాటుకుంటూ సినిమాను పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాడు. అయితే కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ అభిమానులకు మాత్రం ఓ పండగలా అనిపించే చిత్రమిది.
ప్లస్ పాయింట్:
వీరసింహా రెడ్డిగా బాలకృష్ణ నటన
పవర్ఫుల్ సంభాషణలు
కొన్ని యాక్షన్ సీక్వెన్సెన్, ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్:
రొటీన్ ఫ్యాక్షన్ కథాంశం
సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువగా అనిపించడం
రేటింగ్: 3/5