హైదరాబాద్: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈనేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, నటులు మాదాల రంగారావు, బెనర్జీ పుష్పాంజలి ఘటించారు. నటులు బాలకృష్ణ, నందమూరి కల్యాణ్రామ్, నిర్మాత అల్లు అరవింద్ సంతాపం తెలిపారు. కైకాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆహార్యం, అభినయాల కలబోత కైకాల..
ఆహార్యం, అభినయం, ఆంగికాల కలబోత.. కైకాల నటన అని సీనియర్ హీరో బాలకృష్ణ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. ఎన్టీఆర్తో కలిసి పలు చిత్రాల్లో ఆయన అభినయం ఎన్నటికీ మరువలేమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు.
కైకాల మృతి సినీరంగానికి తీరని లోటని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్, సత్యనారాయణ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉండేదని చెప్పారు.
కైకాల సత్యనారాణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నారు. ఆయన నటించిన పాత్రలు లేవన్నారు. భావోద్వేగ పాత్రల్లో నటిస్తే కన్నీళ్లు తెప్పించేవారని గుర్తుచేసుకున్నారు. ఏనాడూ వివాదాల జోలికి వెళ్లకుండా అందరితో స్నేహంగా ఉండేవారని చెప్పారు. ఆయన అజాత శత్రువని కొనియాడారు.
సత్యనారాయణ అకాల మరణవార్త తనను కలచివేసిందని హీరో రామ్చరణ్ అన్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
తెలుగు సినీ పరిశ్రమలో తాను అభిమానించే నటుల్లో ఒకరు కైకాల సత్యనారాయణ అని హీరో నాని అన్నారు. ఆయన మరణం తన హృదయాన్ని ముక్కలు చేసిందన్నారు. మన ఇంట్లో మనషిలా అందరితో కలిసిపోయేవారని చెప్పారు. సినిమాల్లో ఆయన నటన అద్భుతమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.