హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కుప్పంలో గుండెపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురైన నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నటుడు బాలకృష్ణ తెలిపారు. ఆయన ఆరోగ్యం శనివారం నాటికంటే మెరుగ్గా ఉందన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని, వైద్యసేవలకు స్పందిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతానికి స్టంట్ వేయడం కుదరలేదని, మళ్లీ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని కోరారు.
శుక్రవారం నారా లోకేష్ కుప్పంలో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయనను దవాఖానకు తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం శనివారం తెల్లవారుఝామున బెంగళూరులోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కార్డియో జెనిక్ షాక్కు గురయ్యారని, తారకరత్న పరిస్థితిని నిత్యం పరిశీలిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
కాగా, తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్రామ్ ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.