బాలకృష్ణ హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. శృతిహాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లో చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…‘ఈ చిత్రానికి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా నాకొక గుర్తుండే ప్రయాణం అయ్యింది.
సినిమాలో సీమ నేపథ్యం కనిపించింది. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తుండటం వల్లే సంతోషంగా ఉండగలుగుతున్నా. నాకు బసవతారకం ఆస్పత్రి, హిందూపురం నియోజకవర్గం, సినిమాలు తప్ప మరో ఆలోచన ఉండదు. టీమ్ అందరికీ ఈ సినిమా విజయం ఘనత దక్కుతుంది. మరిన్ని మంచి చిత్రాల్లో నటించే ప్రోత్సాహాన్ని ఈ సినిమా అందించింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాతలు నవీన్, వై. రవిశంకర్, నాయికలు వరలక్ష్మీ శరత్కుమార్, హనీ రోజ్, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు.