Bala Krishna | టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సతీమణి బసవ రామ తారకం పేరుతో హైదరాబాద్లో స్థాపించబడిన బసవతారకం ఇండో–అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి కూడా అనేక మంది క్యాన్సర్ రోగులు ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి పూర్తిగా ఉచిత వైద్యసేవలు, పేదలు మరియు నిరుపేదలకు ప్రత్యేక రాయితీలు అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకతగా నిలిచింది. సాధారణ రోగులకు కూడా తక్కువ ఫీజులతోనే నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారు.ఈ ఆసుపత్రికి చైర్మన్గా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఆసుపత్రి సేవలను మరింత విస్తరించే దిశగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలంటే నగరాల్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సి రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు ఈ సేవలను పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించేలా మొబైల్ స్క్రీనింగ్ వాహనాలను ప్రారంభించారు. బస్సు స్టీరింగ్ పట్టుకుని స్టార్ట్ చేశారు. అలాగే ఆస్పత్రిలో బ్రాకీథెరపీ యూనిట్ను కూడా ప్రారంభించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 4న బాలకృష్ణ ఈ మొబైల్ క్యాన్సర్ పరీక్ష వాహనాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ వాహనాలను రెండు తెలుగు రాష్ట్రాల గ్రామీణ, దూరప్రాంతాల్లో వినియోగించనున్నారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నివారణకు, ప్రాణాపాయం నుంచి రక్షణకు మంచి అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ఈ మొబైల్ యూనిట్లు కీలక పాత్ర పోషించనున్నాయి.
దాతల సహకారంతో ఈ ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేశామని బాలకృష్ణ తెలిపారు. ఈ మొబైల్ యూనిట్ల ద్వారా పేదలకు పూర్తిగా ఉచితంగా, మధ్యతరగతి ప్రజలకు స్వల్ప రుసుముతో క్యాన్సర్ లక్షణాల పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది పెద్ద ఊరటనిస్తుందని, మరింత మందికి ఆరోగ్య భద్రత కల్పించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యతో బసవతారకం ఆసుపత్రి సేవలు నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల దాకా విస్తరించనున్నాయి.