AVM Saravanan | తమిళ సినీ పరిశ్రమకు నిలువెత్తు చరిత్రగా నిలిచిన ఏవీయం ప్రొడక్షన్స్ స్థాపకుడు ఏ.వి. మేయప్ప చెట్టియార్ తరువాత ఆ సంస్థ బాధ్యతలు చేపట్టి దాని ప్రతిష్టను కొనసాగించిన ప్రముఖ నిర్మాత ఏవీఎం సరవణన్ (AVM Saravanan) 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలంగా చికిత్స అందుతున్నప్పటికీ, ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తమిళ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచేసింది. 1945లో ఏ.వి. మేయప్ప చెట్టియార్ స్థాపించిన ఏవీయం ప్రొడక్షన్స్, దశాబ్దాల పాటు సౌత్ ఇండియన్ సినిమాలలో అగ్రగామిగా నిలిచింది. శివాజీ గణేశన్, ఎంజీఆర్, రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, విజయ్, అజిత్, సూర్య వంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్బస్టర్ సినిమాలను నిర్మించింది. ఏవీయం బ్యానర్లో సినిమా చేయడం అనేది ప్రతి నటుడికి ఒక డ్రీమ్గా ఉండేది.
మేయప్ప చెట్టియార్ మరణం తరువాత సంస్థ బాధ్యతలు చేపట్టిన శరవణన్, ఏవీయం స్టూడియో ప్రతిష్టను దశాబ్దాల పాటు నిలబెట్టారు. ఆయన నాయకత్వంలో ఏవీయం నుంచి వరుస విజయాలు వచ్చాయి. ఆయన మాత్రమే కాదు ఏవీయం సంస్థ ఉద్యోగులందరూ ఆయనపై అపారమైన నమ్మకాన్ని ఉంచేవారు. శరవణన్ వ్యాపారంలో ఎంత పెద్దస్థాయిలో ఉన్నా, వ్యక్తిగతంగా అందరితో ఆప్యాయంగా మెలిగేవారని సినీ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. రజినీకాంత్ నుంచి కొత్త నటుడివరకు ప్రతీ ఒక్కరూ ఆయనను అత్యంత గౌరవంతో చూసేవారు. తమిళ చిత్ర పరిశ్రమ మేయప్ప చెట్టియార్తో సమానమైన ప్రేమ, గౌరవం శరవణన్పై కూడా చూపింది.
ఇటీవలి కాలంలో శక్తి తగ్గి ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయన చికిత్స పొందుతున్నట్టు కుటుంబవర్గాలు వెల్లడించాయి. నిన్ననే తన 86వ పుట్టినరోజును జరుపుకున్న ఆయన, ఈ రోజు ఉదయం మృతి చెందడం అందరినీ కలిచివేసింది. ఏవీయం శరవణన్ ఒక నిర్మాత మాత్రమే కాదు, తమిళ సినీ పరిశ్రమకు ఒక యుగం. ఆయన పనితీరు, ఎథిక్స్, వినయం అనేక తరాలను ప్రేరేపించాయి. ఏవీయం శరవణన్ కుటుంబానికి, అభిమానులకు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.