ప్రముఖ అస్సామీ గాయకుడు, సంగీత దర్శకుడు జుబీన్ గార్గ్ (52) సింగపూర్లో స్కూబా డైవింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ప్రమాదంలో దుర్మరణం చెందారు. అస్సామీతో పాటు బెంగాలీ, హిందీ భాషల్లో ఆయన గాయకుడిగా, స్వరకర్తగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. హిందీ చిత్రం ‘గ్యాంగ్స్టర్’ (2006)లో ఆయన ఆలపించిన ‘యా ఆలీ…’ పాట దేశవ్యాప్తంగా సంగీతప్రియుల్ని అలరించింది. ‘క్రిష్-3’ ‘ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్’ చిత్రాల్లో ఆయన పాడిన పాటలకు మంచి పేరొచ్చింది.
మేఘాలయాలోని తురా నగరంలో జన్మించారు జుబీన్గార్గ్. బాల్యం నుంచే సంగీతంపై మక్కువ ప్రదర్శించే ఆయన 1992లో ‘అనామికా’ అనే అస్సామీ ఆల్బమ్ ద్వారా సంగీత ప్రయాణం ప్రారంభించారు. అనంతరం హిందీ, బెంగాలీ ఇండస్ట్రీల్లో అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. అస్సామీ, బెంగాలీ, నేపాలీతో పాటు 40 భాషల్లో వివిధ యాసల్లో పాటలు పాడి ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నార్త్ఈస్ట్ రాష్ర్టాల్లో ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. జుబీన్గార్గ్ మృతిపట్ల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.