Main Vaapas Aaunga | పాకిస్తాన్కు చెందిన ఒక అభిమాని భారతదేశ సరిహద్దుల్లోని అట్టారీ-వాఘా బోర్డర్ వరకు ప్రయాణించి, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్లను కలుసుకున్నాడు. ‘మై వాపస్ ఆవుంగా’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వీరిద్దరూ బోర్డర్కు రాగా, లాహోర్కు చెందిన ఒక యువకుడు వారిని చూడటానికి అక్కడికి చేరుకున్నాడు. ఈ భావోద్వేగపూరిత కలయికను అతను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, కాసేపు దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయినట్లు అనిపించిందని, మనుషులను ఏకం చేసే శక్తి ఒక్క కళకే ఉందని రాసుకొచ్చాడు. 1947 దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ‘మై వాపస్ ఆవుంగా’ చిత్ర ప్రమోషన్స్ కోసం ఇంతియాజ్ అలీ, రెహమాన్ పంజాబ్లోని అట్టారీ-వాఘా సరిహద్దును సందర్శించారు. “జై హో – ఎ మ్యూజికల్ సెల్యూట్ టు ది బ్రేవ్హార్ట్స్” పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుక సందర్భంగా తన మొదటి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భారతదేశం నుండి భారీగా జనాలు తరలిరాగా, పాకిస్తాన్ వైపు నుండి కూడా అభిమానులు ఆసక్తి చూపించారు.
లాహోర్లోని గుల్బర్గ్ నుంచి కేవలం 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఇండియా బోర్డర్ ఉంటుందని, ఇంతియాజ్ అలీ, రెహమాన్ అక్కడకు వస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా తెలుసుకుని వెంటనే బయలుదేరానని ఆ అభిమాని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నాడు. దాదాపు 2004 తర్వాత తాను మళ్లీ బోర్డర్ వైపు వెళ్లలేదని, సరిహద్దులు అనేవి స్నేహపూర్వకంగా ఉన్నప్పుడే వాటికి విలువ ఉంటుందని తాను నమ్ముతానని అతను తెలిపాడు. రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకే రకమైన పంజాబీ మూలాలు, భాష, సంస్కృతిని పంచుకుంటున్నారని గుర్తుచేశాడు. సరిహద్దు వద్ద ఉన్న ఒక స్నేహితుడి సహాయంతో రెండు దేశాల ప్రజలు ఒకరినొకరు తాకకుండా కేవలం మాట్లాడుకునే వీలుండే ‘జీరో పాయింట్’ వరకు వెళ్ళగలిగానని, అక్కడ ఇంతియాజ్ అలీని చూసి గట్టిగా పేరు పెట్టి పిలిచానని వివరించాడు. ఇంతియాజ్ అలీ సినిమాలపై, కథలపై పాకిస్తాన్లో ఉన్న క్రేజ్ గురించి, అక్కడ ఉన్న సరికొత్త దర్శకులపై ఆయన చూపిన ప్రభావం గురించి మాట్లాడగా, ఇంతియాజ్ చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలిపారన్నాడు. ఆ సంభాషణ ముగిసే సమయంలో తాను ‘మై వాపస్ ఆవుంగా’ (నేను మళ్లీ తిరిగి వస్తాను) అని అనగానే అవతలి వైపు ఉన్న భారతీయులందరూ నవ్వుతూ చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తపరిచారని ఆ అభిమాని ఎమోషనల్ అయ్యాడు.
ఈ హృదయపూర్వకమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వస్తున్న ‘మై వాపస్ ఆవుంగా’ సినిమా కూడా విభజన కాలం నాటి వలసలు, జ్ఞాపకాలు, సొంతూరిపై ఉండే మమకారం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, శర్వరి, నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.