Arjuna Phalguna Movie review | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు చిత్రసీమలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు( Sree Vishnu ). పక్కింటి కుర్రాడి తరహా పాత్రలకు చిరునామాగా నిలుస్తున్నాడు. ఆ పంథాను కొనసాగిస్తూ శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ’ ( Arjuna Phalguna ). తేజ మార్ని(జోహార్ ఫేమ్) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మ్నాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2021 ఏడాది చివరి రోజున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకున్నది?శ్రీవిష్ణుకు హిట్ దక్కిందా లేదా?తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే..
గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరికి చెందిన కుర్రాడు అర్జున్(శ్రీవిష్ణు). డిగ్రీ పూర్తిచేసి ఊళ్లోనే ఖాళీగా ఉంటాడు. సిటీలో ఉద్యోగాలు చేయడం కంటే సొంత ఊరిలోనే కుటుంబసభ్యులతో కలిసి బతకడంలోనే ఆనందం ఉంటుందని నమ్ముతుంటాడు. ప్రియురాలు శ్రావణి(అమృతా అయ్యర్)తో పాటు ముగ్గురు స్నేహితులే(మహేష్, చైతన్య, రాజ్కుమార్) అతడి ప్రపంచం. ఊళ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందుకొస్తుంటాడు అర్జున్. బ్యాంకు లోను కట్టకపోవడంతో స్నేహితుడి(మహేష్) ఇళ్లను అధికారులు జప్తు చేయడానికి వస్తారు. ఆ డబ్బును తాను ఇస్తానని అర్జున్ వారికి మాటిస్తాడు. వారం రోజుల్లో నాలుగున్నర లక్షల డబ్బు అవసరం కావడంతో గంజాయి అక్రమ రవాణా చేయడానికి అర్జున్, అతడి స్నేహితులు సిద్ధపడతారు. శ్రావణి కూడా వారితో కలిసి వెళ్తుంది. అనుకోకుండా ఐదుగురు పోలీసులకు దొరికిపోతారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ రౌడీ గ్యాంగ్ వారిని చంపడానికి వెంటపడుతుంటుంది. ఈ ప్రమాదాల బారి నుంచి అర్జున్ ఎలా బయటపడ్డారు?తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?పోలీసులతో పాటు రౌడీలు అర్జున్ వెంటపడటానికి కారణమేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
స్నేహానికి హీరో అండగా నిలబడటం, స్నేహితుల కష్టాల్ని తీర్చడానికి పోరాటం చేసే కథాంశాలతో తెలుగు తెరపై లెక్కకుమించిన సినిమాలొచ్చాయి. అర్జున ఫల్గుణ ఆ కోవకు చెందిన సినిమానే. స్నేహం గొప్పతనానికి గోదావరి జిల్లా నేపథ్యాన్ని జోడిస్తూ దర్శకుడు తేజ మార్ని ఈ కథ రాసుకున్నారు. కథ కంటే టేకింగ్లోనే కొత్తదనాన్ని కనబరచడానికి ప్రయత్నించాడు. హీరోయిజం, భారీ యాక్షన్ సీక్వెన్స్ లాంటి హంగుల జోలికి పోకుండా వాస్తవికతకు దగ్గరగా సినిమాను తెరకెక్కించడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. అంతర్లీనంగా రైతులు ఎదుర్కొనే సమస్యల్ని జోడిస్తూ కథను నడిపించారు.
పల్లె వాతావరణాన్ని, అక్కడి మనుషుల మనస్తత్వాలను ఆవిష్కరిస్తూ పరిచయఘట్టాలను తీర్చిదిద్దిన తీరు బాగుంది. డిగ్రీ పూర్తిచేసి ఊళ్లోనే జులాయిగా తిరుగుతున్న స్నేహితులకు కుటుంబం నుంచి ఎదురయ్యే ఇబ్బందులు, ఊళ్లోనే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి వారు పడే కష్టాలు ప్రథమార్థంలో వినోదాన్ని పంచాయి. గంజాయి రవాణా చేయడానికి వారు అంగీకరించడంతో కథ వినోదం నుంచి థ్రిల్లర్కు మలుపు తిరుగుతుంది. పోలీసులు, రౌడీల నుంచి తెలివితేటలతో వారు పారిపోయే సన్నివేశాలతో ద్వితీయార్థం ఉత్కంఠను పంచుతుంది. పతాక ఘట్టాలను రొటీన్గా యాక్షన్ అంశాలతో కాకుండా కామెడీతో ముగించడం కొత్తగా ఉంది.
దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. స్క్రీన్ప్లే విషయంలో ఒకటి రెండు మలుపులు మినహా ఆసక్తి లోపించింది. ఆ మలుపులు ఊహాతీతంగానే ఉన్నాయి. నాయకానాయికల మధ్య ఉన్న ప్రేమను చాటిచెప్పే బలమైన సన్నివేశాలు కనిపించవు. హీరోతో పాటు అతడి స్నేహబృందం ప్రాణాలతో పోరాడుతున్నా..ఆ సన్నివేశాల్లో సీరియస్నెస్ లేదు. తెలివిగా సమస్యల నుంచి వారు తప్పించుకున్నట్లుగా చూపించారు. ఆ ప్లాన్స్ మొత్తం లాజిక్లకు దూరంగా సాగుతాయి.
అర్జున్ పాత్రలో శ్రీవిష్ణు సహజత్వంతో కూడిన నటనను కనబరిచాడు. తనలోని మాస్ కోణాన్ని ఆవిష్కరిస్తూ వచ్చే కొన్ని ఎలివేషన్స్ బాగున్నాయి. గోదావరి యాసలో అతడు చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా పూర్తి భారాన్ని తానే మోశాడు. అమృతా అయ్యర్కు తనలోని నటనకౌశలాన్ని ప్రదర్శించే అవకాశం రాలేదు. శ్రీవిష్ణు స్నేహితులుగా కనిపించిన రంగస్థలం మహేష్, చైతన్య, రాజ్కుమార్ నటన బాగుంది. తమ కామెడీ టైమింగ్తో నవ్విస్తూనే ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించారు. నరేష్, సుబ్బరాజు, దేవిప్రసాద్ పాత్రల్లో కొత్తదనం లేదు.
కథ, స్క్రీన్ప్లే విషయంలో దర్శకుడు తేజ మార్ని మరింత కసరత్తులు చేసుంటే బాగుండేది. కమర్షియల్ దర్శకుడిగా నిరూపించుకోవాలనే తపనతో రొటీన్ దారిని అనుసరించాడు. సుధీర్వర్మ సంభాషణలు ఆక్కడక్కడ ఆకట్టుకున్నాయి. కథకు అడ్డంకి అనే ఆలోచనతో మూడు పాటలను మాత్రమే పెట్టారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ నేపథ్య సంగీతం బాగుంది. గోదావరి పల్లె ప్రాంతాలతో పాటు అడవులు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను ఛాయాగ్రాకుడు జగదీష్ చీకటి చక్కగా చూపించారు.
టైమ్పాస్ ఎంటర్టైనర్ ఇది. . రియలిస్టిక్ సినిమాల్ని ఇష్టపడే వారిని మెప్పిస్తుంది.
రేటింగ్-2.75/5