రామ్చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తున్నది. అత్యున్నత సాంకేతిక హంగులతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ స్వరాలను సమకూర్చబోతున్నారు.
శనివారం ఏ.ఆర్.రెహమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యూనివర్సల్ అప్పీల్ కలిగిన కథాంశమిదని, ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని, ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సాన.