అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ
సచివాలయంలోని రెండో బ్లాక్లో సమావేశమైంది. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ నేతృత్వంలోని పలు విభాగాలకు చెందిన అధికారులు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు మొత్తం 13 మంది కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సినిమా థియేటర్ల యజమానులు, ఏపీ ఫిలిం ఛాంబర్, కమిటీ సూచించిన సినిమా టికెట్ల ధరకు దగ్గరగా ప్రతిపాదనలు ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలోని ఫిలిం ఛాంబర్ సభ్యులు వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన జీవో వారం, పదిరోజుల్లో విడుదల అవుతాయని పేర్కొన్నారు. మొత్తం మూడు స్లాబులు ఉంటాయని, ప్రభుత్వం అటు ప్రజలను , ఇటు సినీ పరిశ్రమను సంతృప్తి పరిచే విధంగా నిర్ణయాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వంద కోట్లరూపాయలతో నిర్మించే సినిమాకు ప్రత్యేక టికెట్ల ధరల పై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చిన్న సినిమా కూడా నిలదొక్కు కోవడానికి ఐదో షోకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించామని తెలిపారు.