హీరోయిన్ల మధ్య వృత్తిపరమైన పోటీ సహజం. వ్యక్తిగతంగా కూడా వారిమధ్య ఈర్ష్యాద్వేషాలుంటాయని కొందరు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే.. స్నేహబంధాలు కూడా తమలో బలంగా ఉంటాయని నిరూపించిన నాయికలు కూడా కొందరున్నారు. వారిలో అనుపమ పరమేశ్వరన్, సాయిపల్లవి ముందు వరుసలో ఉంటారు. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో వీరిద్దరూ ఒకేసారి సక్సెస్ అందుకున్నారు. అప్పట్నుంచీ వీరి మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడిందని చాలామందికి తెలీదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవితో తన అనుబంధాన్ని నెమరువేసుకున్నది అనుపమ పరమేశ్వరన్. ‘తను నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు. నా శ్రేయోభిలాషి కూడా.
కోవిడ్ టైమ్లో సాయిపల్లవి మాటలు నాలో ఆత్మైస్థెర్యాన్ని నింపాయి. ఆ టైమ్లో అయినవారితో కమ్యూనికేషన్ తెగిపోయి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ క్లిష్ట పరిస్థితుల్లో సాయి నాకు అండగా నిలిచింది. నాలో ప్రశాంతత నింపేందుకు తనెంతో శ్రమించింది. ‘మానసిక ఒత్తిడికి సృజనాత్మకతే మందు’ అని తను చెప్పిన మాట నాలో ఎంతో మార్పును తెచ్చింది. నాకు పెయింటింగ్ని పరిచయం చేసింది. రంగులతో కాన్వాస్పై భావాలను పంచుకుంటూ మనసులోని భారాన్ని తగ్గించుకున్నాను. మనశ్శాంతి కోసం అలవరచుకున్న ఈ అలవాటు నాలో కొత్త నైపుణ్యాన్ని వెలికి తీసింది’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్.