ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంది సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే. గత కొద్ది రోజులుగా విక్కీ జైన్తో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ మంగళవారం ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికగా ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తన ప్రియుడితో ఏడడుగులు వేసింది.
పెళ్లికూతురు అంకిత గోల్డెన్ కలర్ లెహెంగాలో ముస్తాబవగా, వరుడు విక్కీ కూడా వధువుకు మ్యాచ్ అయ్యేలా బంగారు- తెలుపు రంగు షేర్వాణీలో రెడీ అయ్యాడు. సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ వధూవరులిద్దూ పెళ్లి మండపం వద్దకు వింటేజ్ కారులో రావడం విశేషం.వీరి పెళ్లి వేదికను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు.
అంకిత గత కొద్ది రోజులుగా తన మెహందీ, ఎంగేజ్మెంట్, హల్దీ, సంగీత్ కార్యక్రమాలకు సంబధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. అవి నెట్టింట తెగ హల్ చల్ చేశాయి. తాజాగా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి అంకిత నటించిన ‘పవిత్ర రిష్తా’ ధారావాహిక బాలీవుడ్ బుల్లితెరపై ఓ సంచలనం కావడంతో ఆమెకి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్ చిత్రీకరణ సమయంలోనే సుశాంత్- అంకితలు ప్రేమలో పడ్డారు. సుమారు ఆరేళ్లపాటు ఈ ప్రేమ బంధం కొనసాగింది. అయితే ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుండి బాలీవుడ్ నటుడు విక్కీజైన్తో ప్రేమలో ఉంది అంకిత.