సినీ రంగంలో నాయికలుగా తమ భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించి చెప్పలేమంటున్నది అందాల తార రాశీ ఖన్నా. గతేడాది రెండేసి చొప్పున తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిందీ నాయిక. అవేమీ ఆమెకు కావాల్సిన కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే ఈ ఏడాది రాశీ నటించిన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందించింది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన తన కొత్త బాలీవుడ్ మూవీ ‘యోధ’ కూడా ఇదే స్థాయిలో ఆదరణ పొందుతుందనే ఆశతో ఉందీ తార. తాజా ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా మాట్లాడుతూ…‘ఎవరి అండ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చాను. నాయికగా గుర్తింపు దక్కించుకున్నాను.
విజయాలు వచ్చినప్పుడు నా అదృష్టాన్ని నమ్మలేకపోయా. అయితే నటిగా నేను కోరుకునేది ప్రేక్షకుల అభిమానం పొందడమే. ‘ఫర్జీ’ వెబ్ సిరీస్తో ఉత్తరాది వారికి దగ్గరయ్యా. ఇప్పుడు ‘యోధ’ చిత్రంతోనూ అదే ఆదరణ ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలోనూ నా పాత్ర కథలో కీలకంగా సాగుతుంది. మన ప్రతిభను ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దు అనేది నా అభిప్రాయం. అస్థిరత్వం ఉండే సినీ రంగంలో భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించలేం. నాయికగా ఇంకా పైకి ఎదగవచ్చు లేదా అవకాశాలు తగ్గిపోవచ్చు’ అని చెప్పింది. ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళంలో ‘ఆరణ్మయి 4’, పా విజయ్తో ఓ చిత్రంలో నటిస్తున్నది.