మంగళవారం రోజు ప్రకాశ్ రాజ్ ప్యానెల్కి సంబంధించిన వారందరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ.. గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే యాంకర్ అనసూయ ఈసీ మెంబర్గా గెలిచిందని మొదట వార్తలు రాగా.. ఉదయాన్నే అనసూయ ఓడిపోయిందని అధికారికంగా ప్రకటించారు ఎలక్షన్ అధికారులు. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన అనసూయ తన ట్విట్టర్లో పలు పోస్ట్లు పెట్టింది.
మంగళవారం నాడు ప్రకాష్ రాజ్ నిర్వహించిన మీడియా సమావేశానికి మిగిలిన ప్యానల్ సభ్యులతో పాటు హాజరైన అనసూయ ఓడిపోయాననే ఫ్రస్ట్రేషన్లో మీడియాపై చిందులు తొక్కింది. నేను మెజార్టీలో ఉన్నానని కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. నేను మీడియాలో ఉంటే న్యూస్ రిపోర్ట్ చేయడాన్ని ఎంచుకుంటాను. క్రియేట్ చేయను. గాలి వార్తలు చెప్పను. కచ్చితంగా ఎన్నికల అధికారులు ప్రకటిస్తేనే చెబుతాను. ఓట్ల లెక్కింపు దగ్గర ఎవరో ఇచ్చిన సమాచారాన్ని నేను నమ్మను అంటూ అనసూయ మండిపడింది.
నా పర్సనల్ పనుల వల్ల హడావిడిగా వచ్చి ఓటు వేశాను.. ఆ తరువాత అక్కడే ఉన్నాను.. మాకు ఎవ్వరికీ తెలియని విషయాలు మీకు తెలిసిపోతున్నాయి. ఓటింగ్ మొదలు కాకుండానే మీకు నచ్చినట్టు రాసేసుకుంటున్నారు. ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ ఇంకా ఓపెన్ చేయాలేదు.. బయట అప్పుడే గెలిచేశారని బ్రేకింగ్లు వేసేశారు. నేను చాలా ధైర్య వంతురాల్ని. ఎదుటివారు నువ్ ఓడిపోయావ్ అని చెప్తే వినేటంత పిరికిదాన్ని కాదు.. ఒకవేళ నేను గెలిచి ఉంటే.. చేసే సర్వీస్ మంచిగా ఉండేది.
నేను 11 ఏళ్లుగా ఇక్కడ ఉన్నాను.. ఈరోజు అందరి సమక్షంలో చెప్తున్నాను.. నిజాలు తెలుసుకోకుండా నా పేరు తీశారంటే కోర్టుకి వెళ్తాను . నా ప్రమేయం లేకుండా నా పేరు తప్పుడు వార్తలకు వాడితే.. తప్పకుండా కోర్టుకి వెళ్తాను’ అని వార్నింగ్ ఇచ్చింది అనసూయ.