“రామబాణం’ చిత్రం వాణిజ్య పంథాలో సాగుతూనే కుటుంబ అనుబంధాలకు దర్పణంలా ఉంటుంది. వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి’ అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు గొప్ప కథ కుదిరింది. ‘లక్ష్యం’ తర్వాత ఈ సినిమాలో నేను, జగపతిబాబు అన్నదమ్ములుగా నటించాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గోపీచంద్తో మూడో చిత్రమిది. హ్యాట్రిక్ కాంబినేషన్ కాబట్టి విజయం ఖాయమనే ధీమాతో పనిచేశాం. ఫస్ట్కాపీ చూసినప్పుడే మంచి అనుభూతి కలిగింది’ అని తెలిపారు. ఇది మనందరి కుటుంబ కథగా అలరిస్తుందని రచయిత భూపతిరాజా పేర్కొన్నారు.