Allu Arjun | ‘పుష్ప’తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ఆ సినిమాతోనే ఉత్తమనటుడిగా జాతీయ అవార్డును అందుకొని, తెలుగులో ఆ క్రెడిట్ సాధించిన తొలి హీరోగా నిలిచారు. ఆరుసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం అభిమానులకు ఆయన ఐకాన్ స్టార్. ఇప్పుడు బన్నీ కీర్తికిరీటంలోకి మరో కలికితురాయి వచ్చి చేరింది. ప్రపంచప్రఖ్యాతి చెందిన వారి మైనపు బొమ్మలను ఏర్పాటు చేసే ప్రతిష్టాత్మక మ్యూజియం దుబాయ్లోని బ్లూ వాటర్స్ దగ్గర ఉన్న మేడమ్ టుస్సాడ్స్. ఆ మ్యూజియం వారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మైనపు బొమ్మను తమ మ్యూజియంలో ఏర్పాటుచేశారు. ఈ బొమ్మను చూడటానికి మీడియా వారితోపాటు ఎంతోమంది ఇన్ఫ్లూయెన్సర్స్ మ్యూజియంకు లైన్ కట్టారు.
ఈ మైనపు బొమ్మ పర్ఫెక్ట్గా రావడానికి అల్లు అర్జున్ నుంచి 200 రకాల కొలతలను సేకరించామని సంస్థ జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ మ్యూజియంలో మైనపుబొమ్మ ఏర్పాటు చేయడం పెద్ద గౌరవం అని, ఈ గౌరవం పొందిన తొలి సౌత్ ఇండియన్ నటుడు అల్లు అర్జునే అని వారు తెలిపారు. రీసెంట్గా అల్లు అర్జున్ కూడా తన మైనపు బొమ్మను సందర్శించి, నిజంగా తనను తాను అద్దంలో చూసుకుంటున్నట్టు ఉందని, రియలిస్టిక్గా చేశారని సంస్థవారిని ప్రశంసించారు.