హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, స్వరకర్త దేవిశ్రీప్రసాద్ కలయికలో వచ్చిన పాటలన్నీ చక్కటి ప్రజాదరణ పొందాయి. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక..’ అనే ఫస్ట్ సింగిల్ను ఈ నెల 13న విడుదలచేయబోతున్నారు. ఐదు భాషల్లో ఐదుగురు ప్రధాన గాయకులు ఈ పాటను ఆలపించనుండటం విశేషం. తెలుగులో శివం, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడంలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్, తమిళంలో బెన్నీదయాల్ ఈ పాటకు గాత్రాన్ని అందించనున్నారు. చిత్తూరు బ్యాక్డ్రాప్లో ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పుష్పరాజ్గా విలక్షణ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా రెండు భాగాల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్.