Allu Arjun | ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనలో అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో కడింపల్లి దుర్గ అనే మానసిక దివ్యాంగురాలు తన తండ్రిని కోల్పోయింది. అంతకు ముందు ఆమె తల్లి కూడా తీవ్ర అనారోగ్యంతో మరణించడంతో దుర్గ అనాథలా మిగిలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే స్పందించి ఆమెకు అండగా నిలిచారు. దుర్గ పరిస్థితిని గుర్తించిన అల్లు అర్జున్ ప్రతినెలా రూ.7,500 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ఆమెకు జీవితాంతం కనీస ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు బన్నీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మొదటి నెలకు సంబంధించిన రూ.7,500ను దుర్గ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఈ విషయాన్ని దుర్గ తరఫున వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకుంటూ అల్లు అర్జున్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచిన బన్నీపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ మధ్య అల్లు అర్జున్ తన మంచి మనసు చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీనటి పావలా శ్యామలకు కూడా ప్రతినెలా ఆర్థిక సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అదే సమయంలో మరో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టుల నుంచి అధికారిక అప్డేట్స్ వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Vetlapalem Durga . 7500/- First Month Ammount Done 👍 ✅
Thank you @alluarjun garu ❤️🙏🏻#alluarjun #vetlapalem #AAFA pic.twitter.com/VUla2PM0Ig
— Sagar bolisetti (@Sagar_Bolisetty) March 18, 2026