Allu Arjun | హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కమిటీ సభ్యులతో విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందస్తు ప్రణాళికలను ప్రారంభించారు. సమావేశంలో ఎంపికైన ప్రతినిధులకు వారి బాధ్యతలు, పాత్రలు, నిర్వహణ విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.
ఫ్యాన్స్ అసోసియేషన్ చేపట్టే కార్యకలాపాలు మరింత క్రమబద్ధంగా, సమర్థవంతంగా కొనసాగేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ స్థాయి కమిటీల ఏర్పాటు ఎంత కీలకమో నేతలు వివరించారు. భవిష్యత్తులో అభిమానుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంతో పాటు సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు ఈ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తాయని అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, సమాజపట్ల ఆయనకు ఉన్న బాధ్యతా భావాన్ని ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలు ఉండాలని నాయకులు సూచించారు.
అభిమానుల ఐక్యత, సామాజిక సేవా దృక్పథం, మరియు హీరోపై ఉన్న అభిమానాన్ని సానుకూల దిశగా మలచడం ఈ సంఘం ముఖ్య ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. ఇక పుష్ప2 చిత్రంతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీ క్రేజ్ ఎల్లలు దాటింది. ఆయన సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.