ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ ఎంతగా విలవిలలాడిందో మనం చూశాం. పలు ప్రాంతాలలో వరదలు పోటెత్తడంతో జన జీవనం స్తంభించింది. భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. ప్రజలు రోడ్డున పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకొనేందుకు ముందుకు వచ్చింది. పలువురు ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు జూనియర్ ఎన్టీఆర్.. వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వరదల విపత్తు బాధిత కుటుంబాలకు తన వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్కి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నట్లుగా ప్రకటించారు చిరంజీవి. ఇక రామ్ చరణ్ కూడా తన వంతు సాయంగా రూ. 25 లక్షలు ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.
మరోవైపు.. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి తనవంతు సాయంగా.. రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇక తాజాగా అల్లు అర్జున్ తన వంతు సాయంగా పాతిక లక్షల విరాళం ప్రకటించాడు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు పడ్డ పరిస్థితులు నన్ను కదిలించాయి. ఈ క్రమంలో నా వంతు సాయంగా ఏపీ రిలీఫ్ ఫండ్కి పాతిక లక్షల విరాళం అందిస్తున్నా అని చెప్పాడు.