అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నరేష్ మాట్లాడుతూ “నాంది’ సినిమా చేసినప్పుడు ఎలా గర్వంగా ఫీలయ్యానో ఇప్పుడు అదే భావనతో ఉన్నా. నవరసాల్లో హాస్యాన్ని పండించడం చాలా కష్టం. ఏడిపించడం సులువు. కామెడీ చేసిన వారు నవరసాల్లో దేనినైనా పండించగలరు. నా కెరీర్లో గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలు కథాంశాల ఎంపికలో కొత్తదారులను చూపించాయి.
ఈ క్రమంలోనే నాంది, ఉగ్రం లాంటి సినిమాలు చేసే అవకాశం దొరికింది. ‘ఉగ్రం’లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. ఈ సినిమాలో నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తా. ఇందులో నటనాపరంగా నా ఉగ్రరూపం చూస్తారు’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ కథ అనుకున్నప్పుడే నరేష్ను ఊహించుకున్నా. యాక్షన్తో పాటు ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా ఉంటాయి. కథాగమనంలో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది’ అన్నారు. మిస్సింగ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నా యని, ఈ కథపై విస్త్రతంగా పరిశోధన చేశానని రచయిత తూమ్ వెంకట్ తెలిపారు. తమ సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని నిర్మాతలు చెప్పారు.