Adipurush | ‘ఆదిపురుష్’ చిత్రంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. వివిధ భాషలకు చెందిన సీనియర్ నటులు కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రామాయణ గాథను వక్రీకరించారని, సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సోషల్మీడియా వేదికగా సినీ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ ఆల్ ఇండియా సినీ వర్కర్క్స్ అసోసియేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. హిందువుల మనోభావాలతో పాటు భారతీయ సనాతన ధర్మం గొప్పతనాన్ని కించపరిచేలా ఈ సినిమాను తెరకెక్కించారని ఆల్ ఇండియా సినీ వర్కర్క్స్ అసోసియేషన్ ఆరోపించింది.
‘మతాలకు అతీతంగా శ్రీరాముడు భారతీయ ప్రజలందరికి దేవుడు. అలాంటి మహోన్నత పురాణ పురుషుడిని ఓ వీడియో గేమ్ క్యారెక్టర్లా ప్రజెంట్ చేయడం మమ్మల్ని బాధించింది. అలాగే ఈ సినిమాలోని సంభాషణలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయి.
ఈ చిత్రాన్ని వెంటనే నిషేధించాలని, భవిష్యత్తులో ఓటీటీ వేదికల్లో కూడా ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరుతున్నాం. దర్శకుడు ఓంరౌత్, చిత్ర రచయితపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆల్ ఇండియా సినీ వర్కర్క్స్ అసోసియేషన్ ప్రధానమంత్రికి రాసిన లేఖలో పేర్కొంది. ప్రభాస్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.