సెకండ్ వేవ్ వలన ప్రస్తుతం దేశంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ పరిస్థితులలో కరోనాతో బాధపడే వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. రీసెంట్గా అక్షయ్ కుమార్ .. గౌతమ్ గంభీర్ నడిపిస్తున్న స్వచ్చంద సంస్థకు కోటి రూపాయలు విరాళం అందించగా, సామాన్యులకు వైద్యసాయం అందించడం కోసం సకల సౌకర్యాలతో వెయ్యిపడకల ఆస్పత్రి నిర్మించి తీరుతానని వెల్లడించాడు హిందీ నటుడు గుర్మీత్ చౌదరి.
తాజాగా కోవిడ్ పేషెంట్స్కు అండగా నిలిచేందుకు అలియా భట్ సైతం ముందుకు వచ్చింది. ఇటీవల విహార యాత్ర ముగించుకొని వచ్చిన అలియా భట్ దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులని గమనించి అవసరమైన వారికి సాయం చేస్తామని, కోవిడ్ 19 పేషెంట్స్ తో పాటు వారి అవసరాలు తీర్చుతామని తన ఇన్స్టాగ్రామ్లో తెలిపింది. అలియా జర్నలిస్ట్ ఫయే డిసౌజాతో కలిసి పని చేయనుండడం సంతోషంగా ఉంది. వారు సంబంధిత సమాచారం మరియు అభ్యర్థనలను గుర్తించి సాయం చేసేందుకు తోడ్పడతారు అని పేర్కొంది. అలియా భట్ ఈ మధ్యే కరోనా నుండి కోలుకున్న విషయం విదితమే. కొద్ది రోజులుగా, సోను సూద్, తాప్సీ, స్వరా భాస్కర్, భూమి పెడ్నేకర్, సోనాల్ చౌహాన్ వంటి నటులు ఎక్కువ మందికి సాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.