‘ఈ కథ రాసింది 2012లో. కథ కూడా ఆ టైమ్లో జరుగుతుంది. ఇందులోని అంశాలు ప్రతి మనిషికీ కనెక్టయ్యేలా ఉంటాయి. ప్రేమ, లక్ష్యం ఒకేసారి ఎంచుకోవాల్సివస్తే? అనే ప్రశ్నకు సమాధానమే ఈ కథ. సందేశంతో కూడిన ప్రేమకథ ఇది’ అన్నారు దర్శకుడు మారేష్ శివన్. ఆయన దర్శకత్వంలో దినేష్తేజ్, హెబ్బాపటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధానపాత్రలు పోషించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి సాయిసుధాకర్ నిర్మాత. ఈ చిత్రం ఈనెల 10న విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మారేష్ శివన్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ పాత్రికేయులతో ముచ్చటించారు. ప్రేమ, భావోద్వేగాల నడుమ సాగే ఈ కథలో సంగీతం ప్రధానబలం. సుభాష్ ఆనంద్ ఇచ్చిన నేపథ్యసంగీతం, పాటలు ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. నక్కిన త్రినాథరావు, బెల్లంకొండ శ్రీనివాస్, బెక్కం వేణుగోపాల్ తదితరులు ఈ సినిమా చూసి అభినందించారు. రెండువందల థియేటర్లలో ఈ నెల 10న సినిమా విడుదల కానుంది’ అని చెప్పారు దర్శకుడు మారేష్ శివన్. ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు.