దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageshwar Rao), సీనియర్ నటి జయసుధ (Jayasudha)జంటగా నటించిన చిత్రం ‘ప్రతిబింబాలు’ (Prathi Bimbalu). ఈ చిత్రం దాదాపు 40 ఏండ్ల తరువాత ఇప్పుడు విడుదల కాబోతుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ విష్ణుప్రియ కంబైన్స్ పతాకంపై సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘గతంలో నేను వియ్యాలవారి కయ్యాలు, ఒక దీపం వెలిగింది, శ్రీ వినాయక విజయం, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు చిత్రాలు అగ్రతారలతో నిర్మించాను. కానీ 1982లో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధలతో నిర్మించిన ‘ప్రతిబింబాలు’ చిత్రాన్నిఅనివార్య కారణాల వల్ల విడుదల చేయలేకపోయాను. అయితే ప్రస్తుత సాంకేతికతను మిళితం చేసి, సరికొత్త హంగులతో సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి పురస్కరించుకుని అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం కూడా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అని తెలిపారు.