‘ఈ కథ విని షాకయ్యాను. హారర్ థ్రిల్లర్స్ని ఇష్టపడేవారికి కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. ఈ కథలోని మలుపులు, దానికి తగ్గట్టు ఆర్ఆర్ ప్రేక్షకుల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది.’ అని హీరో అఖిల్రాజ్ అన్నారు. త్రిగుణ్, హెబ్బాపటేల్లతో కలిసి ఆయన నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. హేమ వెంకటేశ్వరరావు నిర్మాత. ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ సమర్పకుడు.
ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అఖిల్రాజ్ మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ‘బన్నీవాస్, వంశీ నందిపాటి జడ్జిమెంట్ ఉన్న నిర్మాతలు. ‘లిటిల్హార్ట్స్’తో నవ్విస్తామని చెప్పి నవ్వించారు.
మా ‘రాజా వెడ్స్ రాంబాయి’తో ఏడిపిస్తామని చెప్పి ఏడిపించారు. ఈ సినిమాతో భయపెడతాం అని చెప్పారు. సో.. కచ్ఛితంగా మీరంతా భయపడి తీరతారు. అందుకే హార్ట్ వీక్ ఉన్న వాళ్లు సినిమా చూడొద్దని చెప్పాం’ అని గుర్తు చేశారు అఖిల్రాజ్. ఇందులో వినయ్గా కనిపిస్తానని, త్రిగుణ్, సిరి, హెబ్బాపటేల్, మైమ్ మధులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని, సినిమా పట్ల గౌరవం, అవగాహన ఉన్న దర్శకుడు శ్రీనివాస్ మన్నె అనీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని ఆయన గొప్పగా మలిచారనీ, తప్పకుండా ఈచిత్రం విజయం సాధించి, మా అందరికీ పేరు తెస్తుందని అఖిల్రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.