బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా పాండమిక్లోనూ ఘనవిజయాన్ని సాధించింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించారు. శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా శతదినోత్సవాన్ని కర్నూలులో నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…‘శతదినోత్సవ కార్యక్రమం జరిపి ఎన్ని ఏండ్లయిందో. మేము ఈ సినిమా ప్రారంభించినప్పుడు ‘సింహా’, ‘లెజెండ్’ను మించి ఉండాలని ఆశించలేదు. కరోనా వల్ల అనేక నడుమ పూర్తి చేశాం. ‘అఖండ’ విజయం సాధించడం అవసరం అని ప్రేక్షకులు భావించారు. అందుకే ఇంత గొప్ప విజయాన్ని అందించారు. దర్శకుడు బోయపాటి ఉన్నాడంటే నాకు నమ్మకంగా ఉంటుంది. ఏ నటుడితో ఎలాంటి హావభావాలు తీసుకోవాలో ఆయనకు తెలుసు. నా సినిమాలే నాకు పోటీగా భావిస్తుంటా. ప్రకృతి, ధర్మం, ఆడవాళ్ల జోలికి వస్తే భగవంతుడే బాధ్యత తీసుకుంటాడు అనేది ఈ చిత్రంలో చూపించాం.’ అన్నారు. “సింహా’ నుంచి బాలకృష్ణతో నా ప్రయాణం మొదలైంది. 13 ఏళ్లుగా కలిసి సినిమాలు చేస్తున్నాం. ఆయనను కొత్తగా చూపించాలనే తపనే మా కాంబినేషన్లో మంచి విజయాలు వచ్చేలా చేస్తున్నది. అభిమానులే బాలకృష్ణ బలం. ధర్మం, భగవంతుడి గురించి సినిమాల్లో చెప్పే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అది నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది’ అని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి, శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.