తిరుపతి : నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా చిత్రబృందం గురువారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుంది. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నిర్మాత రవీందర్ రెడ్డి కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిత్రబృందాన్ని అర్చకులు శాలువాతో సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
బాలకృష్ణ మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకుంటున్న సినీ పరిశ్రమకు అఖండ చిత్రం ఊపిరి పోసిందని అన్నారు. ఎంతో మందికి ధైర్యానిచ్చిందని, చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా బుధవారం రాత్రి శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని బాలకృష్ణ, బోయపాటి శీను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు.