Ajith | తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి మోహిని మణి శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోసహజమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. 84 ఏళ్ల మోహిని మణి మరణవార్త తెలిసిన వెంటనే తమిళ సినీ వర్గాలు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో అజిత్ కుమార్తో పాటు అనూప్ కుమార్, అనిల్ కుమార్ కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా ఉండే మోహిని మణి మరణం వారి కుటుంబానికి తీరని లోటుగా మారింది.
ఇప్పటికే 2023లో అజిత్ తండ్రి పి.ఎస్. మణి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. తండ్రి మరణం నుంచి కోలుకోకముందే ఇప్పుడు తల్లి కూడా దూరం కావడంతో అజిత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లి మరణవార్త అందుకున్న వెంటనే విదేశాల్లో ఉన్న అజిత్ కుమార్ అత్యవసరంగా చెన్నైకి బయలుదేరినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబం గోప్యతను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మోహిని మణి మృతి పట్ల తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో అజిత్ కుటుంబానికి ధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నారు.
ఇక అజిత్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. దర్శకుడు మగిజ్ తిరుమేని తెరకెక్కించిన ‘విదాముయార్చి’తో పాటు, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. సినిమాలతో పాటు అంతర్జాతీయ మోటార్ రేసింగ్ రంగంలో కూడా ఆయన తన ప్రతిభను చాటుతున్నారు. ఇటలీలో జరిగిన అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్లో “జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందుకున్న అజిత్, దుబాయ్లో జరిగిన ప్రతిష్టాత్మక 24H కార్ రేసింగ్ ఛాంపియన్షిప్లో తన జట్టుతో కలిసి మూడో స్థానాన్ని సాధించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం అజిత్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్తో కలిసి ‘AK 64’ ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్న సమయంలో తల్లి మరణం ఆయన వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.