NTR | తెలుగు స్టార్ హీరోల స్థాయి పాన్ ఇండియాకు చేరింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు మన కథానాయకులతో సినిమాలు నిర్మించేందుకు ముందుకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా తెలుగు చిత్రాలకు, తెలుగు నటులకు దక్కుతున్న ఆదరణే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో నేరుగా బాలీవుడ్లో సినిమాలు చేసేందుకు మన హీరోలూ ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తున్నది.
బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్తో ఎన్టీఆర్ ఓ చిత్రానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ ఇప్పటికే ప్రభాస్ హీరోగా ‘ఆది పురుష్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబినేషన్లో సినిమా కూడా ప్రారంభించారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్తోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేయాలని భూషణ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఉత్తరాదిన కూడా పెరిగింది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటన దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయల్సిఉంది.