ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన రోజు నుంచే ఈ సినిమా సంభాషణలు, పాత్రల చిత్రణపై దేశవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. తాజాగా ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు నిర్లక్ష్య వైఖరిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా సంభాషణలు రామాయణ ఇతిహాస ఔన్నత్యాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన హైకోర్టు సెన్సార్ బోర్డ్ తీరును తప్పుబట్టింది.
సెన్సార్ చేసే సమయంలో అలాంటి చవకబారు సంభాషణలను ఎలా అనుమతించారని సెన్సార్ బోర్డ్ను ప్రశ్నించింది. పౌరాణిక చిత్రంలో ఈ తరహా సంభాషణలను ఉంచడం వల్ల భవిష్యత్తు తరాలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టు విచారణకు చిత్ర దర్శకనిర్మాతలు హాజరుకాక పోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. పలువురు మేధావులు సైతం ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.