ఆది సాయికుమార్, దిగాంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘క్రేజీ ఫెలో’. ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామెహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఫణికృష్ణ సిరికి దర్శకుడు. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత కెకె రాధామోహన్ మాట్లాడుతూ…‘నిర్మాతగా నేనెప్పుడూ కథను నమ్ముతాను. ఈ చిత్రంలో బలమైన కథ ఉంది.
అయితే కొందరు దర్శకులు కథ చెప్పినంత అందంగా సినిమా తెరకెక్కించరు. ఫణికృష్ణ కొత్త దర్శకుడైనా అనుకున్నది అనుకున్నట్లు రూపొందించాడు. సకుటుంబంగా చూసేలా సినిమా ఉంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హీరో ఆదికి సరిపోయే క్యారెక్టర్ ఇది. బాగా నటించాడు. చిన్న చిత్రాలతో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టం. పాండమిక్ తర్వాత ఓటీటీ ప్రభావం పెరిగిపోయింది. అయితే మంచి కథ ఉంటే వారు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇద్దరు నాయికలు దిగాంగన, మిర్నా మీనన్ తమ నటనతో ఆకట్టుకుంటారు’ అన్నారు.