Adarsha Kutumbham | విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. 47’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ‘ఏకే 47’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ చిత్ర ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేశ్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందట. ముఖ్యంగా ఫ్లాష్బ్యాక్లో వెంకీ ‘రా ఏజెంట్’ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ స్పై థ్రిల్లర్లా కాకుండా, ఈ పాత్రకు ఓ ప్రత్యేకమైన లోపాన్ని జోడించి దర్శకుడు త్రివిక్రమ్ కథను డిజైన్ చేశాడట. వెంకటేశ్ పాత్రకు దృష్టి లోపం ఉంటుందని, అలాంటి పరిస్థితిలో కూడా ఒక రా ఏజెంట్గా ఆయన ఎలా మిషన్లు పూర్తి చేశాడు? ఎలాంటి ఛేజ్లు చేశాడు? అనే అంశాలను పూర్తి ఎంటర్టైనింగ్, థ్రిల్లింగ్ శైలిలో చూపించనున్నారని సమాచారం.
ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. త్రివిక్రమ్ సినిమాల్లో ఎమోషన్తో పాటు వినోదం, స్టైలిష్ ట్రీట్మెంట్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు అదే శైలిలో యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్పై డ్రామా మేళవింపుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు శర్మ ఈ సినిమాలో తీవ్రవాదిగా నటించబోతున్నట్లు సమాచారం. ఆయన పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు వెంకీ కెరీర్లో క్లాసిక్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా ఆ సినిమాల్లో కనిపించిన కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై భారీ హైప్ ఏర్పడింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు యాక్షన్ థ్రిల్లర్ అంశాలు కూడా ఉండటంతో ‘ఏకే 47’ వెంకటేశ్ కెరీర్లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.