Renu Desai | ఈ మధ్య ఇండస్ట్రీలో పలువురు నటీమణులు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు పోస్ట్లు పెడుతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. గతేడాది సమంత, ఇటీవలే కల్పికా గణేష్, మమతా మోహన్దాస్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కాగా తాజాగా మరో నటి తన అనారోగ్యాన్ని బయటపెట్టి అందరిని షాక్కు గురిచేసింది. ఆ నటి మరెవరో కాదు రేణూ దేశాయ్. ‘బద్రి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణూ దేశాయ్.. ఆ తర్వాత పవన్ను పెళ్లాడి తెలుగువారికి మరింత దగ్గరైంది. అయితే పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే వీరిద్ధరూ పరస్పర అంగీకారంతో విడిపోయి దూరంగా ఉంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా రేణూ దేశాయ్ గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. ‘నా శ్రేయోభిలాషులందరికీ ఓ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇన్నేళ్లుగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాను. ఎలాంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నానో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నేను వాటిని ఎదుర్కొనేందుకు ఎంతటి శక్తిని కూడబెట్టుకున్నానో చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు ఇలా ఈ విషయాలన్నీ చెప్పేందుకు ఓ కారణం ఉంది. నాలా ఎవరైనా బాధపడుతూ ఉంటే. వారిలో ధైర్యాన్ని నింపేందుకు, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసేందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను.
మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఒక రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశను కోల్పోవద్దు. నిరుత్సాహపడొద్దు. జీవితం మీద, మన మీద మనకు నమ్మకం ఉండాలి.ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్ ప్రైజ్లను ప్లాన్ చేసి ఉంది.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నవ్వుతూ వాటిని ఎదుర్కోండి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది.. మందులు వేసుకుంటున్నాను.. యోగా చేస్తున్నాను. పోషకాహారాన్ని తీసుకుంటున్నాను.. త్వరలోనే మళ్లీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను. షూటింగ్లో పాల్గొంటాను అని చెప్పుకొచ్చింది. కానీ ఇంతకి తనకు వచ్చిన వ్యాధి ఏంటనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా, కాస్ట్యూమ్ డిజైనర్గా ఇలా పలు విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది రేణూ దేశాయ్. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె రవితేజ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుంది.