Actress Poorna | మలయాళ నటి పూర్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె అసలు పేరు షమ్న ఖాసిమ్. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పూర్ణ.. దీపావళి సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.
దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీని వివాహం చేసుకుని తన ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పారు. సోమవారం దుబాయ్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్న ఖాసిమ్, షనీద్ అసిఫ్ ఆలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్న పూర్ణ.. తన భర్తను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టారు.
‘‘నేను ప్రపంచంలోనే అందమైన స్త్రీని కాకపోవచ్చు. నాలో ఒక మంచి జీవితభాగస్వామికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండకపోవచ్చు. కానీ, మీరు నన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నారు. నా పనిని ప్రోత్సహిస్తున్నారు. నన్ను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఈరోజు మన కుటుంబ పెద్దలు, బంధువుల మధ్య నేను నీతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా’’ అంటూ రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.