Meera Jasmine | ప్రముఖ నటి మీరా జాస్మిన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కేరళ ఎర్నాకుళంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
మీరా జాస్మిన్ తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు. వారిలో చిన్న కుమార్తె మీరా జాస్మిన్. 2001లో లోహితదాస్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారన్ సినిమాతో మీరా సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. విశాల్ నటించిన పందెం కోడి అనే డబ్బింగ్ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత శివాజీ నటించిన అమ్మాయి బాగుంది చిత్రంతో టాలీవుడ్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్తో పాటు, భద్ర, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు వంటి సినిమాలో తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. 2014లో దుబాయ్కు చెందిన ఇంజనీర్ అనిల్ జాన్ను పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది వచ్చిన విమానం సినిమాలో గెస్ట్ అప్పిరియెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం మీరా జాస్మిన్ ది టెస్ట్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.