Actress Kasturi | తమిళ సీనియర్ నటి కస్తూరి తెలుగు ప్రజల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు బీజేపీ కార్యకర్త అయిన కస్తూరి తాజాగా బీజేపీ సభలో బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ.. ద్రావిడ సిద్దాంత వాదులను, వారి ఐడియాలజీని ప్రశ్నించే క్రమంలో రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని తెలుగు ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో తాజాగా క్లారిటీ ఇచ్చింది కస్తూరి.
తెలుగు ప్రజల గురించి నేను వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు అధికార డీఎంకే పార్టీకి చెందిన కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిన్న జరిగిన బీజేపీ సభలో ద్రావిడ సిద్దాంత వాదులను, వారి ఐడియాలజీపై నేను చేసిన వ్యాఖ్యలను తమిళ మీడియాలో తప్పుగా వక్రీకరిస్తూ చెబుతున్నారు. తెలుగు గడ్డ నా మెట్టినిల్లుతో సమానం. నా కుటుంబం తెలుగు వాళ్లు అని తెలియక ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ ట్రాప్లో తెలుగు మీడియా పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఎంతోమంది నాపై ప్రేమ చూపుతున్నారు. దాని నుంచి నన్ను వేరు చేసేందుకే ఈ కుట్రను అమలు చేస్తున్నారు. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కస్తూరి ఎక్స్ వేదికగా రాసుకోచ్చింది.
అసలు ఏం జరిగిందంటే.. తమిళనాడులో జరిగిన బీజేపీ సభలో కస్తూరి మాట్లాడుతూ.. రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని.. అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది. 300 ఏండ్ల క్రితం ఒక రాజు వద్ద అంత:పుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. ఇప్పుడు వారు తమది తెలుగు జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం తమిళనాడు ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులున్నారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దు. ఇతర భార్యలపై మోజుపడొద్దు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇలా మంది చెబుతున్నారు కాబట్టే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోందని కామెంట్స్ చేసింది.. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట, తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.