Actor Vishal | తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రస్తుతం దేశమంతా రాజకీయ వేడి బాగా నడుస్తుంది. దాంతో ఎవరు ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేసినా వెంటనే వైరల్ అవుతున్నాయి. తాజాగా విశాల్ కూడా తాజా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించాడు. రత్నం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన విశాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై స్పందించడమే కాకుండా.. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారో కూడా క్లారిటీగా చెప్పేశాడు. పైగా తన రాజకీయ భవిష్యత్తుపై కూడా క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో.
తాను ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చాను అని.. వాళ్లే నామినేషన్ రిజెక్ట్ చేశారు. 2026 ఎన్నికల్లో పోటీ చేస్తాను.. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టే విశాల్ వచ్చాడు.. వాళ్ళు చెప్పింది చేస్తే విశాల్ మళ్లీ సినిమా యాక్టర్ గానే ఉండిపోతాడు అంటూ గట్టిగానే కౌంటర్ వేశాడు ఈ హీరో. జనాలకు మంచి చేయాలి అనుకున్నప్పుడు ఎందుకు ఇన్ని రాజకీయ పార్టీలు.. అందరూ కలిసి మంచి చేయొచ్చు కదా అని కొత్త వాదనకు తెర తీశాడు విశాల్. అన్ని పార్టీలు అందరూ కలిసి పనిచేస్తే ఒక్క సంవత్సరంలోనే మంచి చేయొచ్చు.. 5 సంవత్సరాలు ఎందుకు అనేది ఈయన వాదన.
రాజకీయ నాయకులు నటులుగా మారుతున్నారు.. అందుకే నటులు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు విశాల్. ఇక సినిమాలు రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేము.. ఎక్కడో ఏసి రూమ్ లో కూర్చొని చేసే పని కాదు ఇది.. రాజకీయాలకు రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోవాలి అని చెప్పుకొచ్చాడు ఈయన. ఇన్ డైరెక్ట్గా పవన్ కల్యాన్ను ఈయన టార్గెట్ చేశాడు అంటూ ఫ్యాన్స్ అప్పుడే ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు.
ఈ సమాజంలో డబ్బులు పెట్టి కొనాల్సినవి ఉచితంగా ఇస్తున్నారని.. ఉచితంగా రావాల్సిన విద్యను, మెడికల్, నీళ్లు అమ్మేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు విశాల్. అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.. అప్పుడే సమాజం బాగుపడుతుంది అంటూ చెప్పాడు ఈ నటుడు. ఈ పరిస్థితులు మార్చే రాజకీయ నాయకుడికి తాను జీవితాంతం ఓటు వేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా కొత్త ఓటర్లు కచ్చితంగా ఓటు వేయాలి.. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని వాళ్ళు వదులుకోకూడదు అని చెప్పాడు విశాల్.
ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ.. తాను ఏ పార్టీ సపోర్టర్ కాదు.. కానీ ఐ లైక్ జగన్.. ఈసారి కూడా ఆయనే మళ్లీ సీఎంగా వస్తారు అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. దాంతో పాటు ఈ మధ్య జగన్ పై జరిగిన దాడి గురించి కూడా స్పందించాడు విశాల్. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు మంచి చేయాలని బయటకు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.. ఈ అటాక్స్ మొదటిసారి కాదు.. గతంలోనూ జరిగాయి.. ఇక మీద జాగ్రత్తగా ఉండాలి ఇదంతా పార్ట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ లైఫ్ అని చెప్పుకొచ్చాడు ఈయన. మొత్తానికి జగన్ సీఎం అవుతాడు అంటూ విశాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.