Suhas | అదేంటి అంత మాట అంటున్నారు.. మనోడు నటించిన సినిమాలన్నీ బాగానే ఆడుతున్నాయి కదా.. పైగా బాక్సాఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయి.. రెట్టింపు లాభాలు తీసుకొస్తున్నాయి.. అన్నింటికీ మించి చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయి.. ఇంకేంటి.. ఇలాంటి టైమ్లో ఇంకా డేంజర్ బెల్స్ ఏంటి అనుకుంటున్నారు కదా..? వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. సుహాస్ ఏం చేసినా టైమ్ బాగానే ఉంది కాబట్టి ఏం కనిపించడం లేదు కానీ కథల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అసలు సినిమా అప్పుడు కనిపించడం ఖాయం. బేసిక్గా సుహాస్ హీరో కాదు.. చిన్న చిన్న కారెక్టర్లు చేసుకుంటూ హీరోగా మారాడు.. ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా మధ్యలో కొన్ని విలన్ కారెక్టర్లతో పాటు కమెడియన్గానూ నటించాడు సుహాస్.
అలాంటి సమయంలోనే మూడేళ్ల కింద కరోనా సమయంలో కలర్ ఫోటో సినిమా చేశాడు. ఈ సినిమా ఓటీటీలో వచ్చింది కాబట్టి హాయిగా చూసేశారు ఆడియన్స్. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని రైటర్ పద్మభూషణ్ చేశాడు. అది కూడా బాగానే ఆడింది. అందులో కలర్ ఫోటో ఎమోషనల్ సినిమా అయితే.. రైటర్ పద్మభూషణ్ ఎంటర్టైనర్. తాజాగా విడుదలైన అంబాజిపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా కూడా ఎమోషనల్ సినిమానే. కొత్త దర్శకుడు దుశ్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 నిర్మించడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రీమియర్స్ నుంచే సినిమాకు టాక్ బాగానే వచ్చింది. మొదటి రోజు 2.5 కోట్ల వరకు గ్రాస్ కూడా వసూలు చేసింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకు ప్రశంసలు ఎంతగా వస్తున్నాయో.. విమర్శలు కూడా అంతే వస్తున్నాయి.
ఎందుకంటే సుహాస్ కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని.. అన్నీ ఒకే తరహా కథలు చేస్తుంటే సుహాస్ కెరీర్ డేంజర్ జోన్లోకి వెళ్లడం ఖాయం అంటున్నారు ఆయన్ను అభిమానించే వాళ్లు. కలర్ ఫోటో సినిమాలో కలర్ గురించి టాపిక్ నడిస్తే.. ఇక్కడ కులం గురించి కథ నడుస్తుంది. మిగిలిందంతా అదే సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది అనేది కొందరి అభిప్రాయం. నెక్ట్స్ సినిమా నుంచి కచ్చితంగా కథల విషయంలో వైవిధ్యం ఉండాల్సిందే. అలా కాదని మళ్లీ కులం, కలర్ అంటూ టాపిక్స్ తీసుకొస్తే మాత్రం కచ్చితంగా భంగపాటు తప్పదు. ప్రస్తుతం ప్రసన్న వదనంతో పాటు మరో మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు సుహాస్. ఇందులో సగం సినిమాలు ఇదే ఏడాది విడుదల కానున్నాయి.