అమరావతి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హత్య కేసులో అరెస్టయ్యారు. స్వయానా బావ హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందంటూ ఫిర్యాదు అందడంతో శుక్రవారం రామవరంలో రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజు రెడ్డి ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందారు. భర్త సత్తిరాజు రెడ్డి మరణంపై అనుమానం ఉందంటూ ఆయన భార్య రామకృష్ణారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
రామకృష్ణారెడ్డి అరెస్టును టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఆయనను వెంటనే విడుదల చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులపై కక్ష సాధింపునకు దిగుతుందని ఆక్షేపించారు. సంబంధం లేని కేసుల్లో నల్లమిల్లిని ఇరికించేందుకు ప్రయతిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అవినీతిని ఎండగట్టినందకే రామకృష్ణారెడ్డిపై ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపించారు.